24, సెప్టెంబర్ 2009, గురువారం

మహాత్ములు - నైతిక విలువలు - 2.

వేద,వేదాంగ - ఉపనిషత్ - వేదాంతములు, శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ప్రబంధ, కావ్యములు -
మానవ సృష్టికి, మానవ చరిత్రకు పునాది. విద్యతో, విజ్ఞానంతో, విచక్షణా జ్ఞానంతో, జన్మ సంస్కారంతో
మానవులు నూటికి నూరుపాళ్ళు తన దైనందిన ధర్మాన్ని మనో వాక్కాయ కర్మణా ఆచరిస్తూ, అందమైన
మానవత్వ సౌధాలను నిర్మించుకోవాలి. ఇది దైవాదేశం. ఇది తప్పరానిది. సృష్ట్ర్యారంభానికి ముందే
సృష్టి కర్త నిర్ణయించింది. ఏది తప్పు - ఏది ఒప్పు. ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదు. ఏది ఆచరించాలి.
ఏది ఆచరించకూడదు. ఏది పాటించాలి. ఏది పాటించకూడదు. అన్న వాటిని శాసించాడు. దానిని
ప్రతిఘటించడం సృష్టి వినాశనానికే దారి తీస్తుంది. భగవదాగ్రహానికి గురి కావడం ఎంత మాత్రమూ
శ్రేయస్కరం కాదు. ఆయన పాలన సర్వే సర్వత్రా ధర్మబద్ధమైనదిగానే ఉండాలి. దీనికి తిరుగు లేదు.
సృష్టి సరిగ్గా సాగాలంటే, సజావుగా ఉండాలంటే ధర్మ బద్ధమైన ప్రవర్తన మానవులకు అత్యంతావశ్యకం.
ఎదిరించి చేటు తెచ్చుకోవటం పరమ మూర్ఖత్వం. అందుకే తనకు మారుగా మనల్ని అన్ని విధాలుగా
సంస్కరించడం కోసం ఎందరో దైవ ప్రతినిధులను, దైవాంశ సంభూతులను ఈ భూమి పైకి పంపించాడు.
ఆ మహానుభావులు, ఆ మహోన్నతులు, ఆ మహితాత్ములు, ఆ మహాత్ములు భగవత్ సందేశాలను
అనేకవిధాలుగా - అనేక రూపాలుగా - అనేక సందర్భాలలో సమయోచితంగా ఉద్భోదించారు.
మహర్షుల రూపంలో, యతుల రూపంలో, సాధు పుంగవుల రూపంలో, మునీశ్వరుల రూపంలో,
వేదాంత దేశికుల రూపంలో, తత్వవేత్తల రూపంలో, పురోహితుల రూపంలో, పండితుల రూపంలో,
కవుల రూపంలో, కళాకారుల రూపంలో ఈ భువిపై జన్మించి, సంస్కారాలను సుబోధక మొనరించారు.
మానవాళిని తీర్చిదిద్దారు. ధర్మాన్ని నాలుగు పాదాలా నిలిపారు. కానీ, సృష్టి క్రమంలో, కాల గమనంలో,
కాల గర్భంలో యుగాలు అంతరించి, ఆవిర్భవిస్తున్నప్పుడల్లా దైవదత్తమైన మానవాతీత శక్తులు సాధించుకున్న
కొందరు అతి తెలివి మూర్ఖులు రాక్షసులుగా తయారై, అతిశయంతో, గర్వాహంకారాంధతన సాటి మానవులకు
కీడు కలిగిస్తూ, పైశాచికానందాన్నిపొందుతూ, ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. ఇది ఎవ్వరూ క్షమించలేని
భగవదాపరాధం. దండనార్హం. దానికి వారు మూల్యం చెల్లించాల్సిందే.
































23, సెప్టెంబర్ 2009, బుధవారం

మహాత్ములు - నైతిక విలువలు - 1

ఎందరో మహానుభావులు. ఎన్నియో మహానుభవాలు. కష్ట - నష్టములు, కన్నీళ్ళు - కడగండ్లు, అన్నింటినీ దిగమింగి
ఒోర్చి, సహించి, తమ జీవితానుభవ సారాన్ని - సారాంశాన్ని సమస్త మానవాళి కోసం ఉద్భోదించి యున్నారు.
ఆ స్ఫూర్తి, స్పందన, మానవతా విలువలు, సమస్యా పరిష్కారములు జగత్కళ్యాణ కారకాలుగా విలసిల్లి, మానసిక
చైతన్య వికాసం కలిగించి, అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి, మానవాభ్యుదయానికి తార్కాణంగా నిలిచారు.
వారు చెప్పిన ప్రతీ వాక్యం ఒక్కో ఉద్గ్రంధం చదివినంత జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. విద్యార్ధి స్థాయి నుంచి - మేధావుల
స్థాయి వరకూ ఆలోచనలకు పదును బెట్టే కార్యాచరణ పంథాగా మార్గదర్శనం - దిశా నిర్దేశనం చేస్తాయి.
శాంత - ప్రశాంతయుతమైన మనశ్శాంతిని ప్రసాదిస్తాయి. వారి అడుగు జాడల గురుతులు బ్రతుకు బాటలు
పండించుకునే నవ,నవోన్మేష నందనోద్యాన వనాలుగా రూపుదాల్చి, సుమ సౌరభాలు గుబాళింప చేస్తాయి.
ప్రతీ ఒక్కరినీ అలరింప చేస్తాయి. ఆలోచింప చేస్తాయి. విజ్ఞాన - సుజ్ఞాన - ప్రజ్ఞాన కాంతి పుంజములు లోకంలో
నలుదెసలా విస్తరింప చేస్తాయి. మానవత్వాన్ని ఆవిష్కరింప చేస్తాయి. మేధస్సును వికసింప చేస్తాయి.
చతుర్విధావస్థల యందు, చతుర్విధాశ్రమములయందు, చతుర్విధ పురుషార్ధములయందు, చతుర్విధోపాయములుగా
మార్గాంతరములు చూపిస్తూ - వ్యక్తిగత ధర్మాలను, కుటుంబ ధర్మాలను, సామాజిక ధర్మాలను, మానవతా ధర్మాలను,
ప్రాకృతిక ధర్మాలను, కాల ధర్మాలను విశదీకరించి, విపులీకరించి - సకల, సద్విధ, సాత్విక భావాలు నింపి,
అంతర్ముఖుల గావించి, అంతర్మథనం కలిగించి, అంతరాత్మను దర్శింపజేసి, పరమాత్మాన్వేషణం చేసే సత్తా
కలుగ జేస్తారు. మానవ జీవిత సౌభాగ్యాన్ని సుసంపన్నం చేసుకుని, జన్మ సార్ధకత్వాన్ని సాధించ గలుగుతారు.
అందుకే ఈ మహాత్ముల వాక్యాలు మానవత్వ కావ్యాలనడంలో ఎంతమాత్రమూ సందియము లేదు.
నైతిక విలువలు పతనావస్థకు దిగజారకముందే తల్లి,దండ్రులు - తమ పిల్లలను బాల్యావస్థ నుండి, వారి నడవడికను
తీర్చిదిద్దాలి. మహాత్ముల వాక్యాలను విడమరచి చెప్పి, వారిని సత్ప్రవర్తనాపరులుగా తీర్చిదిద్దాలి. అదే మీ పిల్లలకు
మీరిచ్చే నిజమైన ఆస్థి. అదే తల్లి,దండ్రుల గురుతర బాధ్యత కూడా.